పెట్రోల్ బంకుల్లో క్యూ.. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్, కారణమిదే
Hyderabad: పెట్రోల్ బంకులకు వాహనదారులు పోటెత్తారు. దీంతో హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ పంపుల ముందు మంగళవారం (జనవరి 2) మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రధాని రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు మెరుపు ఆందోళనకు దిగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇంధనం దొరకదేమోనని వాహనదారులు ముందు జాగ్రత్తగా ఫిల్ చేయించుకునేందుకు బారులుతీరారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. కొంత మంది వినియోగదారులు క్యాన్లు పట్టుకొని వచ్చారు. హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు పడేలా కేంద్రం చట్ట సవరణ చేసింది. వాహనంతో ఢీకొట్టి పారిపోతే, ఆ కేసులో పదేళ్ల జైలు శిక్ష లేదా రూ. 7 లక్షల జరిమానా విధించేలా సవరణలు చేసింది. ఈ సవరణను ప్రైవేట్ వాహనాల యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రక్, లారీ, క్యాబ్, ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెలో పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందేమోనని వాహనదారులు అప్రమత్తమయ్యారు. సాయంత్రానికి సమ్మె విరమించడంతో ట్యాంకర్లు తిరిగి పెట్రోల్, డీజిల్తో బయల్దేరాయి.